తెలుగు చిత్ర పరిశ్రమలో మారుతున్న డైనమిక్స్పై నిర్మాత బన్నీ వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘పర్సంటేజ్ డీల్స్’ లేదా ‘రేవెన్యూ షేరింగ్’ పై కాకుండా, అసలు బేసిక్ అంశమైన ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకు ఎలా తీసుకురావాలి? అనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా అన్నారు.
బన్నీ వాస్ ప్రధానంగా ప్రస్తావించిన విషయం – ఒక సినిమా విడుదలైన నెలలోపే ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్కు వచ్చే ప్రేక్షకుడి ఉత్సాహం తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా మూతపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వాస్తవానికి, ఓటీటీ డీల్స్ నిర్మాతలకు షార్ట్టర్మ్ లాభాల్ని ఇవ్వవచ్చు. కానీ దీని వల్ల లాంగ్ టర్మ్ లో థియేట్రికల్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతోంది. ఎగ్జిబిటర్లతో పాటు చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలు పెద్ద నష్టాలు చూస్తున్నారు.
బన్ని వాస్ పెట్టిన పోస్ట్ లో ఏముందంటే..
‘‘ఎగ్జిబిటర్లు, నిర్మాతలు గ్రహించాల్సింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజీ విధానం కాదు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అన్న విషయాన్ని వాళ్లు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉంది.
ఈ విషయాన్ని పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు దూరమైపోతారు. ఈ సమయంలో చాలామంది యజమానులు తమ థియేటర్లను నడపలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే.. కేవలం మల్టీప్లెక్సుల వల్ల మీ సినిమాకు థియేటర్స్ నుంచి వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. ఈ విషయాన్ని పెద్ద హీరోలు గ్రహించాలి’’ అని బన్నీ వాస్ పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఆ పెద్ద స్టార్ హీరోలు ఎవరు, అందరూనా లేక ప్రత్యేకించి ఎవరినైనా ఉద్దేశించి అన్నారా అనేది పెద్ద క్వచ్చిన్ .