పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీర మల్లు’. ఈ చిత్రం రిలీజ్ కన్నా మిగతా విషయాలలో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ఒత్తిడిలో పడింది. ఎన్నో సంవత్సరాలుగా డిలే అవుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ విషయమై ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ వీడియో స్పష్టమైన డెడ్లైన్ పెట్టిందని తెలుస్తోంది. “ఇంకా వాయిదా అంటే, డీల్ డ్రాప్ చేసేస్తాం!” అంటూ అల్టిమేటం ఇచ్చిందని వినికిడి.
ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీలు మే 9 మరియు జూన్ 12 అంటూ రెండుసార్లు ప్రకటించి, చివరికి వాయిదా వేసిన నిర్మాతలపై ఓటీటీ దిగ్గజం తీవ్ర అసహనంతో ఉంది. దీంతో అమేజాన్ ప్రైమ్ ఈసారి మాత్రం కఠినంగా స్పందించింది. తాజా ఒప్పందం ప్రకారం… జూలై నెల చివర్లోగా సినిమా థియేటర్లలోకి రాలేదంటే, డీల్లో ఉన్న మొత్తాన్ని కట్ చేస్తామని స్పష్టంగా చెప్పింది.
ఇటీవలే “కుబేర” చిత్రంపై ఓటీటీ సంస్థలు వేసిన వాయిదా పెనాల్టీ (10% డిడక్షన్) విషయాన్ని నిర్మాత సునీల్ నారంగ్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా ‘హరిహర వీర మల్లు’ టీంకు కూడా డెడ్లైన్ విధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ఈ చిత్రానికి ఎ.ఎం. రత్నం నిర్మాతగా, జ్యోతి కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈ షాక్ తర్వాత దర్శక, నిర్మాతలలో కదలికలు మొదలయ్యాయి. కొత్త విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ వేటెడ్ సినిమా… ఈసారి నిజంగా రిలీజ్ అవుతుందా? లేక ఇంకోసారి వాయిదా పడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.