ఒక సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ విడుదల కాకముందే… కథ చోరీ దుమారాలు రేపడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, స్టోరీ కాపీ అయిందని కోర్టు మెట్లు ఎక్కే రోజులు వచ్చేశాయి. ఇప్పుడు మరో ‘కథ యుద్ధం’ మొదలైంది. అయితే ఈ సారి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మద్య!
ETV Win వర్సెస్ ZEE5.
ఇటీవల ZEE5 రిలీజ్ చేసిన కొత్త వెబ్సిరీస్ ‘విరాటపాలెం’ ట్రైలర్ చూసి, ETV Win మేనేజ్మెంట్ ఒక్కసారిగా షాక్ తిన్నట్టయ్యింది. ఎందుకంటే… ఆ ట్రైలర్లో చూపించిన కథ, క్యారెక్టర్లు, స్క్రీన్ప్లే అంతా కూడా తమ ప్రాజెక్ట్ అయిన ‘కానిస్టేబుల్ కనకం’ కథతో తేడా లేకుండా ఉన్నాయని అనిపించటమే.
వాస్తవానికి ప్రశాంత్ అనే దర్శకుడు, ఈ కథను మొదట ZEE5కి వినిపించాడట. రెండు సంవత్సరాల క్రితమే! కానీ అప్పుడు వాళ్లు ప్రాజెక్ట్ను డ్రాప్ చేశారు. అదే కథను తర్వాత ప్రశాంత్, ETV Winకి తీసుకెళ్లి ‘కానిస్టేబుల్ కనకం’ పేరుతో డెవలప్ చేశారు. ఇప్పుడు సడన్గా ZEE5వాళ్లు అదే లైన్ను ఆధారంగా చేసుకుని ‘విరాటపాలెం’ అనే టైటిల్తో రిలీజ్కు రెడీ అయ్యారట!
ఈవిన్ వర్గాలు ఈ అంశంపై ఆగ్రహంతో స్పందిస్తున్నాయి
“కథ రిజిస్ట్రేషన్ 2022లో చేశాం. స్క్రీన్ప్లే, క్యారెక్టర్స్, ఫీల్ అన్నీ మా స్క్రిప్టు లోవే. కానిస్టేబుల్ కనకం మా ఒరిజినల్ సిరీస్. ఇప్పుడు అదే కథను మాస్ అట్మాస్ఫియర్ లో విరాటపాలెంగా తీస్తే, అది స్పష్టమైన కథ దోపిడీ. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం ” అని హెచ్చరిస్తున్నారు.
ఇక జీ5 విషయంలో ఆసక్తికర విషయం ఏంటంటే… వారు జాతీయ స్థాయిలో పెద్ద ఓటీటీ సంస్థ. అలాగే ఈవిన్ కూడా తెలుగు ప్రేక్షకుల్లో బలమైన బేస్ ఉన్న ప్లాట్ఫాం. ఇద్దరి మధ్యే ఇలా కథ యుద్ధం జరగడం, ఇప్పుడది కోర్టుల వరకూ వెళ్లేలా ఉండడం, ఇండస్ట్రీలో సీరియస్ డిబేట్కు దారి తీస్తోంది.
ఇదిలా ఉంటే, విరాటపాలెం ఈ నెల 27న ZEE5లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈవిన్ స్టే ఆర్డర్ తీసుకురాగలగటమా? లేక సీరిస్ వచ్చేసిన తర్వాతే న్యాయపోరాటం మొదలవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అసలు కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ మానేనా? లేక విరాటపాలెమే నిజమైన ఆవిష్కరణనా? అన్నది త్వరలో తేలిపోతుంది.