యాంకర్ గా,నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. కంటిన్యూగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకూ యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా రష్మీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే గత కొద్ది నెలలుగా ఆమె ఆరోగ్యం ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది.
ఈ నేపధ్యంలో రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హాస్పిటల్ లో ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా రష్మీ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. సుమారు ఐదు రోజుల్లోనే నా శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తొమ్మిదికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాను. వైద్యులను సంప్రదిస్తే ముందు దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు’ అని రష్మీ తెలిపింది.
రష్మీ ఇంకా మాట్లాడుతూ.. ‘మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరాను. ఏప్రిల్ 18న సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాను’’ అని రష్మీ రాసుకొచ్చింది. సర్జరీకి ముందు దిగిన ఫొటోలను కూడా రష్మీ నెటిజన్లతో పంచుకుంది. మొత్తానికి తనకు జరిగిన సర్జరీ గురించి రష్మీ క్లారిటీ ఇచ్చింది.