నేర చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు, నిజ జీవితంలో దాడి కేసులో ప్రధాన పాత్రధారిగా మారడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘ది స్టోన్మ్యాన్ మర్డర్స్’, ‘రహస్య’ వంటి క్రైమ్ సినిమాలతో పేరుపొందిన బాలీవుడ్ దర్శకుడు మనీష్ గుప్తా నిజ జీవితంలో ఓ వాస్తవ నేర కథలో ప్రధాన పాత్రధారుడిగా నిలిచారు. శాలరీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్రంగా మారి, ఆయన తన దగ్గర పని చేసిన డ్రైవర్పై కత్తితో దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముంబై వర్సోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
బాధితుడు మహమ్మద్ లష్కర్ గత మూడేళ్లుగా గుప్తాకు పర్సనల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నెల జీతం రూ. 23,000గా నిర్ణయించుకున్నప్పటికీ, ఎప్పుడూ సరిగ్గా చెల్లింపులు జరగడం లేదని లష్కర్ వాదిస్తున్నాడు. తరచూ జీతం ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే వారి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
గత నెల జీతం కూడా ఇవ్వకపోవడంతో పాటు, మే 30న గుప్తా అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అయినప్పటికీ, జూన్ 3న లష్కర్ తన బకాయి జీతం కోసం అడిగినప్పుడు, “పని మళ్లీ ప్రారంభిస్తేనే జీతం ఇస్తాను” అనే వాగ్దానం చేశారని సమాచారం.
జూన్ 5 సాయంత్రం, వర్సోవాలోని గుప్తా నివాసంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం తీవ్రతరమవడంతో, మనీష్ గుప్తా అనూహ్యంగా వంటగదిలోని కత్తిని తీసుకుని లష్కర్పై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన లష్కర్, భవన వాచ్మన్,మిగతా డ్రైవర్ల సహాయంతో కోపర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు.
వైద్య చికిత్స అనంతరం లష్కర్ వర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనీష్ గుప్తాపై ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా గాయపరిచినందుకు కేసు నమోదు అయింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గుప్తా ఇటీవల రవీనా టాండన్, మిలింద్ సోమన్ ప్రధాన పాత్రల్లో నటించిన వన్ ఫ్రైడే నైట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రామ్ గోపాల్ వర్మ శిష్యులుగా ప్రారంభమైన ఆయన కెరీర్ ‘సర్కార్’, ‘D’ వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రచయితగా ముందుకు వెళ్లింది.