ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు వివాదాలకు కొత్తేమీ కాదు. అలాగే తన రాజకీయ వ్యంగ్య చిత్రం వ్యూహం విడుదల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టుల కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ పోస్టులు చేయడం, ఆ తర్వాత వచ్చిన కేసులో ముందస్తు బెయిల్ పొందిన వర్మ, ఆరు నెలల్లో రెండోసారి ఈ రోజు ఉదయం ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
విచారణ ప్రారంభానికి ముందు, వర్మ తనతో తీసుకువచ్చిన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొదటి విచారణకు హాజరైనప్పుడు వర్మ మొబైల్ తీసుకురాలేదు. కానీ, ఈ సారి విచారణకు వచ్చినప్పుడు ఆయన వద్ద మొబైల్ ఉండటంతో, అది రికార్డుల కోసం తీసుకున్నారా లేక విచారణ అనంతరం తిరిగి ఇచ్చారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్పై అభ్యంతరకర భాష, మార్ఫ్ చేసిన ఫొటోలు పోస్టు చేసిన కేసుతో పాటు, వ్యూహం చిత్రాన్ని ఏపీ ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రూ.2.10 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై కూడా పోలీసులు వర్మను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ కేసు గతేడాది నవంబరులో టిడిపి అనుచరుడు ఎం. రామలింగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు అయ్యింది. ఆ సమయంలో వర్మకు పోలీసులు సమన్లు జారీ చేయగా, ఆయన వాటిని తప్పించుకుని ఏపీ హైకోర్టులో బెయిల్ పొందారు. అనంతరం కోర్టు ఆయన విచారణలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.