
ఓటిటీలోకి సుమ కొడుకు సినిమా ‘మోగ్లీ’ – రిలీజ్ డేట్ లాక్!!
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన ‘మోగ్లీ’ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే ప్లాఫ్ టాక్ రావడంతో, “థియేటర్ కంటే ఓటిటీలో చూసేద్దాం” అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్లకు అదే గుడ్ న్యూస్ . సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోగ్లీ’ (2025) ఓటిటీలోకి రావడానికి రెడీ అయింది.
అడవుల నేపథ్యంతో లవ్ – యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రోషన్ కనకాల లీడ్ రోల్ చేయగా, సాక్షి మడోల్కర్ హీరోయిన్గా, బండి సరోజ్ కుమార్ విలన్గా నటించారు. డిసెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్ లైఫ్ స్టార్ట్ అవుతోంది.
‘మోగ్లీ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ETV Win సొంతం చేసుకోగా, జనవరి 1 నుంచి ఓటిటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే థియేటర్ రిలీజ్ అయిన కేవలం 20 రోజుల్లోనే ఓటిటీలోకి సినిమా వచ్చేస్తోంది.
కథేంటంటే:
మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. ఎస్సై కావాలనేది లక్ష్యం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మోగ్లీ (Mowgli 2025 Review) ఊరి పక్కన ఉన్న అడవినే తన అమ్మగా భావిస్తూ.. చిత్రీకరణల కోసం వచ్చే సినిమా యూనిట్స్కు సాయం చేస్తూ జీవనోపాధి పొందుతుంటాడు. అలా ఓ సినిమాకి డూప్గా నటించాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే ఆ చిత్రబృందంలో డాన్సర్ అయిన జాస్మిన్ (సాక్షి మడోల్కర్)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె వినలేదు, మాట్లాడలేదు. అయినా ఇద్దరి మనసులు కలుస్తాయి.
తాను రాముడైతే, జాస్మిన్ సీత అంటాడు మోగ్లీ. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటే సీతారాముల్లాంటి ఆ జంట మధ్యకు రావణుడిలా వస్తాడు క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్కుమార్) అనే ఎస్సై. సీత లాంటి జాస్మిన్పై కన్నేస్తాడు. ఎలాగైనా ఆమెని లోబరుచుకోవాలని పథకం పన్నుతాడు. దాంతో మోగ్లీ, జాస్మిన్ అరణ్యవాసం చేయాల్సి వస్తుంది. మోగ్లీ తన జాస్మిన్ని క్రిస్టోఫర్ నోలన్ నుంచి కాపాడుకోగలిగాడా, లేదా? అనేదే మిగతా కథ.
ప్లాఫ్ టాక్ కారణంగా థియేటర్ మిస్ చేసిన వాళ్లు, రోషన్ కనకాల నటనను ఓసారి ప్రశాంతంగా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ‘మోగ్లీ’ న్యూ ఇయర్ ట్రీట్గా ఓటిటీలోకి ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – ఓటిటీలో అయినా ‘మోగ్లీ’ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందా?
