మంచు విష్ణు (Manchu Vishnu)కు చెందిన ఆఫీస్ లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ రెయిడ్స్ చేసింది. మాదాపూర్, కావూరి హిల్స్లోని ఆయన ఆఫీస్ల్లో రెండు టీమ్ లు ఈ రెయిడ్స్ లో పాల్గొన్నాయి. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రెయిడ్స్ జరుగుతున్న సమయంలో విష్ణు ఆఫీస్ కి మోహన్బాబు, రచయిత కోన వెంకట్ వెళ్లారు.
అంతకుముందు జీఎస్టీ రైడ్స్ పై విలేకరులు ప్రశ్నించగా విష్ణు స్పందించారు. ‘మీరు చెప్పే వరకూ నాకు తెలియదు. అయినా దాచి పెట్టేదేమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’’ అని అన్నారు.
ఎందుకు దాడులు చేసాయి
కన్నప్ప సినిమా ఫైనల్ ప్రింట్ చూసేందుకు విష్ణు ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లిన సమయంలో ఈ దాడులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. కన్నప్ప సినిమా హైలెట్ చేస్తూ మంచు విష్ణు మొదటి నుంచీ బడ్జెట్ గురించి చెబుతూ వస్తున్నారు. డైరక్ట్ గా ఎంత అయిందో చెప్పలేదు కానీ ఆఫ్ ది రికార్డు రెండు వందల కోట్లు అని మీడియా వారికి చెప్పడంతో అదే విస్తృతంగా ప్రచారం అయింది. ఈ వార్త ఐటీ, జీఎస్టీ అధఇకారుల వద్దకూ చేరింది. అందుకు తగ్గట్లుగా పన్నులు కట్టలేదని అనుకున్న అధికారులు దాడులు చేశారు.
మంచు విష్ణు సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘హిందీలో ఫైనల్ కాపీ చూశా. సినిమా ఆఖరిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయని అక్కడ ప్రముఖులు కొందరు అన్నారు. ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారని ఆశిస్తున్నా. దేవుడు, భక్తుడు మధ్య జరిగే కథ ఇది. కన్నప్ప గురించి ఈతరానికి తెలియాలన్న ఉద్దేశంతో తెరకెక్కించాం’’ అని తెలిపారు.
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్, మోహన్బాబు, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. ‘కన్నప్ప’ ఈ నెల 27న విడుదల కానుంది.