

ఒకప్పుడు ఇండియన్ సినిమాకి టాప్ ప్రొడ్యూసర్గా వెలిగిన ఏ.ఎం. రత్నం ఈమధ్యకాలంలో భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో చేసిన ‘హరి హర వీరమల్లు’ – ఎన్నో సార్లు వాయిదా పడి, చివరికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా ఫలితంతో రత్నం గారు తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు.
ఇక ఇప్పుడు ఆయన ఆశలన్నీ ఒకే ఒక సినిమాపైనే ఉన్నాయి – అదే విజయ్ నటించిన ‘ఖుషి’. పవన్ కళ్యాణ్ వెర్షన్ తెలుగు ప్రేక్షకుల దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి అందరికీ తెలుసు. కానీ, ఈ సినిమాకి అసలు బేస్ అయిన తమిళ విజయ్ – జ్యోతికా వెర్షన్ కూడా ఆ సమయంలో ఘన విజయాన్ని సాధించింది.
అదే ‘ఖుషి’ని ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ స్థాయిలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. గత ఏడాది విజయ్ ‘గిల్లి’ రీరిలీజ్ 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అదే మేజిక్ ఇప్పుడు ‘ఖుషి’తోనూ రిపీట్ అయితే, కనీసం కొంతవరకు అయినా ఏ.ఎం. రత్నం ఊపిరి పీల్చుకోవచ్చు.
ఇక 2000లో విడుదలైన ‘ఖుషి’ తమిళ వెర్షన్లో విజయ్ – జ్యోతికా జంట ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సింపుల్ లవ్ స్టోరీకి అప్పటి కాలానికి కొత్తగా అనిపించే స్క్రీన్ప్లే, ఫ్రెష్ కెమిస్ట్రీ, యూత్కీ కనెక్ట్ అయ్యే డైలాగులు ఈ సినిమాను భారీ హిట్గా నిలిపాయి.
తరువాత అదే కథను ఏ.ఎం. రత్నం తెలుగులో రీమేక్ చేసి, పవన్ కళ్యాణ్ – భూమిక జంటను తీసుకొచ్చారు. ఫలితం? తెలుగులో ‘ఖుషి’ రికార్డు స్థాయి బ్లాక్బస్టర్! అప్పట్లో పవన్ కళ్యాణ్ కెరీర్ టర్నింగ్ పాయింట్గా నిలిచిన సినిమా ఇది.
ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే – పవన్ ఎంట్రీ సీన్స్, లవ్-హేట్ ట్రాక్, “ఒకే డే, ఒకే టైం, ఒకే యాక్సిడెంట్” లాంటి సీక్వెన్స్లు ఇప్పటికీ యూత్ గుర్తు పెట్టుకునేంతగా కల్ట్ అయ్యాయి.