7 సార్లు వచ్చినా వదలని వివాదం.. సారా అలీ ఖాన్ భక్తిపై ఆలయ బోర్డు సీరియస్! సనాతన ధర్మంపై ప్రూఫ్ అడుగుతున్న కమిటీ.. అసలు ఏం జరుగుతోంది?

వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్కు ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ షాక్ ఇచ్చింది. తన తొలి సినిమా ‘కేదార్నాథ్’ షూటింగ్ సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 సార్లు ఆ క్షేత్రాన్ని దర్శించుకున్న సారా, ఈసారి వెళ్లాలంటే మాత్రం ఒక కఠినమైన నిబంధనను పాటించాల్సి ఉంటుంది. హిందూయేతరుల ప్రవేశంపై శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) కొత్త ఎస్ఓపి (SOP)ని తీసుకురావడమే దీనికి ప్రధాన కారణం.

సనాతన ధర్మంపై నమ్మకం ఉందా? అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సిందే!
ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మాన్ని పాటించని వారు లేదా ఇతర మతస్థులు ఎవరైనా సరే, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తామని, తమకు సనాతన ధర్మంపై నమ్మకం ఉందని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. “సారా అలీ ఖాన్ తన భక్తిని చాటుకుంటూ అఫిడవిట్ ఇస్తేనే, మేము ఆమెను దర్శనానికి అనుమతిస్తాము” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం సారా మాత్రమే కాదు, ఇతర నాన్-హిందూ సెలబ్రిటీలందరికీ ఈ రూల్ వర్తించనుంది.

ఏప్రిల్ 22 నుంచి కేదార్నాథ్ యాత్ర.. ఈసారి సారా వస్తుందా?
ప్రతి ఏటా ఆలయాలు తెరిచినప్పుడు సారా తప్పకుండా మంచు పర్వతాల మధ్య ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఫోటోలు షేర్ చేసేది. అయితే ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 22న తెరుచుకోనుంది. మరి ఆలయ కమిటీ పెట్టిన ఈ అఫిడవిట్ రూల్కు సారా తలొగ్గి తన భక్తిని నిరూపించుకుంటుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సనాతన ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ప్రవేశం కల్పించాలనే ఈ నిర్ణయంపై భక్తుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

