ఈ మధ్య కాలంలో పాత హిట్ సినిమాల రీరిలీజ్లు టాలీవుడ్లో ఓ ట్రెండ్గా మారిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్డేలకు స్పెషల్ షోల పేరుతో పాత బ్లాక్బస్టర్లను తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు. కొన్ని సినిమాలు ఓ రేంజిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తే, మరికొన్ని ఊహించని రీతిలో ఖాళీ హాళ్లకే పరిమితమవుతున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’కి వచ్చిన రెస్పాన్స్ ఫ్యాన్స్ను సంతోషింపజేసింది. అదే సమయంలో యమదొంగ మళ్లీ విడుదలయ్యాక మాత్రం మిశ్రమ ఫలితాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ పరాజయాన్ని చవిచూసింది.
బాలయ్య బర్త్డే స్పెషల్గా.. కానీ ఫ్యాన్స్ షోలకే పరిమితమైంది!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జయంత్ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ నరసింహా’ను తిరిగి రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా, ఓవర్సీస్లోనూ రిలీజ్ చేసినా, ఊహించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. కొన్ని ఫ్యాన్స్ షోలను మినహాయిస్తే, మిగతా హాళ్లలో కనీస ఆదరణ కూడా లేకుండా పోయింది.
కొత్తగా వచ్చిన ఖర్చులే తిరిగిరాలేదు!
ఈ రీరిలీజ్ కోసం బయ్యర్లుచేసిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. స్పెషల్ షోలు, ప్రమోషన్, డిజిటల్ రీస్టోరేషన్ వంటి అంశాలపై ఖర్చు చేసినా, వాటికి సరైన రీటర్న్ రాలేదు. అందుకే ఈ రీరిలీజ్ను పూర్తిగా “వాష్అవుట్” అయ్యిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఎందుకు వర్కౌట్ కావడం లేదు?
ప్రేక్షకుల అభిరుచి, పాత సినిమాల రీ-విజిట్ విలువ, స్ట్రీమింగ్లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్కు రావాలనే ఆకర్షణ ఇవన్నీ కలిసి ఒక సినిమాకు వర్కౌట్ అవుతాయా లేదా అన్నది డిపెండ్ అవుతోంది. బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ అయితే పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్కు ఆరంభం ఇచ్చినా, ఇప్పుడు వచ్చిన ‘లక్ష్మీ నరసింహా’ మాత్రం అంచనాల్ని అందుకోలేక చతికిల పడి పోయింది.