తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ (TVK పార్టీ వ్యవస్థాపకుడు) కరూర్‌లో జరిగిన విషాదకరమైన స్టాంపీడ్‌ ఘటనపై మూడు రోజుల తర్వాత ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఆ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

విజయ్‌ తన సందేశంలో “నా ఇతర ర్యాలీల్లో ఒక్క చిన్న తప్పిదం కూడా జరగలేదు… అయితే ఎందుకు కేవలం కరూర్‌లోనే ఇంత పెద్ద విషాదం?” అని ప్రశ్నించారు. “కరూర్ ప్రజలే ఇప్పుడు నిజం బయటకు తీసుకొస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

తనపై కక్ష తీర్చుకునే ప్లాన్లు ఉంటే నేరుగా తనని టార్గెట్‌ చేయమని, కానీ తన నేతలపై చేయి వేయొద్దని సీఎం స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ విజయ్‌ స్పష్టంగా చెప్పారు:

“సీఎం గారు… నాపై మీకేమైనా ప్రతీకారం ఉంటే నాకు చేయండి. నా నేతల్ని వదిలేయండి. నేను ఇంట్లోనో ఆఫీసులోనో ఉంటాను” అని వార్నింగ్ ఇచ్చారు.

అలాగే, తాను వెంటనే కరూర్ వెళ్లాలని అనుకున్నా, అక్కడ పరిస్థితులు మరింత టెన్షన్‌ అవుతాయనే భయంతో వెనకడుగు వేసినట్టు చెప్పారు. “నిజానికి నేను వెళ్లేది ఒక్కటే కారణం… బాధిత కుటుంబాలను పరామర్శించడానికి. కానీ నా ప్రెజెన్స్ వల్ల మరో సమస్య తలెత్తకూడదని ఆపుకున్నాను. త్వరలోనే కుటుంబాలను కలుస్తాను” అని చెప్పారు.

చివరగా, “ఇతర జిల్లాల్లో ఎలాంటి సమస్యలు లేవు… కానీ ఎందుకు కరూర్‌లోనే? అసలు నిజం త్వరలో బయటపడుతుంది” అని మళ్లీ హైలైట్ చేశారు.

విజయ్‌ ఈ సంఘటన తన రాజకీయ పోరాటాన్ని మరింత బలపరిచిందని చెప్పి, ఈ సమయంలో తనకు మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ నేతలకు, పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

శనివారం రాత్రి కరూర్‌లో విజయ్‌ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా కొందరు ఒక్కసారిగా ఆయనకు సమీపానికి వచ్చేందుకు ప్రయత్నించారు. దాంతో తొక్కిసలాట జరిగింది. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం రావాల్సిన విజయ్‌.. ఆరు గంటలు ఆలస్యంగా కరూర్‌కు చేరుకోవడం, ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు సభలో పాల్గొనడమే ఈ ఘటనకు కారణాలుగా తెలుస్తోంది. తొక్కిసలాటపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

#chennai, #CM Stalin, #Karur stampede, #TVK Vijay, #Vijay

By admin