‘కేజీయఫ్ 1’, ‘కేజీయఫ్ 2’, ‘కాంతార’ లాంటి బ్లాక్బస్టర్లతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతోంది. ఈ వార్తను స్వయంగా హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిచింది.
‘‘వారంతా అతడిని గ్రీక్ గాడ్ అంటారు. కానీ అతడి పరిధి ఆ పిలుపుతో మించిపోతుంది. అతడు హద్దుల్ని చెరిపేసాడు, హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు’’ అంటూ హృతిక్కు ఓ గ్రాండ్ వెల్కమ్ పలికింది సంస్థ.
ఇందుకు స్పందించిన హృతిక్ రోషన్ — ‘‘విభిన్నమైన కథలు చెబుతూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న హోంబలే ఫిల్మ్స్తో కలవడం ఎంతో సంతోషంగా ఉంది. మా కల చాలా గొప్పది. దాన్ని నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేస్తాం’’ అని అన్నారు.
హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ — ‘‘భాషలకీ, ప్రాంతాలకీ అతీతంగా స్పూర్తిదాయకమైన కథలు చెప్పడమే మా లక్ష్యం. ప్రపంచం ఎక్కడ ఉన్నా, ప్రేక్షకులకు మనసుల్ని తాకే అనుభూతిని అందించాలన్నదే మా నమ్మకం’’ అన్నారు.
ఈ అనౌన్స్మెంట్తో సినీ ప్రియుల్లో హైప్ పెరిగిపోయింది. ఈ ప్రాజెక్ట్కు దర్శకుడు ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
ఇక మరోవైపు హృతిక్ ‘క్రిష్ 4’ కు దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం కూడా బాలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – హోంబలే స్టైల్కి హృతిక్ పవర్ జతకలిస్తే, ఇండియన్ సినిమా ఎక్కడిదాకా దూసుకుపోతుందో చూడాలి!