మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన కన్నప్ప ఎట్టకేలకు విడుదలైంది. భారీ బడ్జెట్తో, ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యామియోలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ డైరక్షన్ లో న్యూజిలాండ్లో షూటింగ్ జరుపుకున్న ఈ పౌరాణిక,చారిత్రక చిత్రం ఎలా ఉందో, అసలు కథేంటో,చూడదగినదేనా, ప్రభాస్ పాత్ర ఎలా ఉంది వంటి విశేషాలు రివ్యూలో చూద్దాం!
స్టోరీ లైన్
నాస్తికుడైన తిన్నడు (మంచు విష్ణు) అడవిలో నివసించే గిరిజన గుంపుల నాయకుడైన నాథనాథుడు (శరత్ కుమార్) కొడుకు. అతనికి నరబలి వంటివి నచ్చవు. అయితే తండ్రి మాట కాదనలేక నిశ్శబ్దంగా ఉండిపోతూంటాడు. మరో ప్రక్క ఆ నాలుగు కొండ గ్రామాల్లో ఒకటైన భద్రగణం లో శివుడి శక్తిని నింపుకున్న వాయులింగాన్ని మహదేవ శాస్త్రి (మోహన్ బాబు) రహస్యంగా పూజిస్తుంటాడు. ఈ శక్తిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న కాలముఖుడు (అర్పిత్ రాంకా), అక్కడి వారిపై విరుచుకుపడతాడు. అతన్ని ఆపేందుకు నాథనాధుడు గిరిజన గూడేల్ని ఏకం చేయాలని యత్నిస్తాడు.
ఇదే సమయంలో, తిన్నడి భార్య నెమలి (ప్రీతి ముకుందన్) వాయులింగాన్ని దర్శించాలన్న కోరికను కోరుతుంది. ఆమె మహా శివభక్తురాలు. ఇదిగా ఉండగా తిన్నడు చేసిన ఓ పని వల్ల అతన్ని గూడెం నుంచి బహిష్కరిస్తారు. అప్పుడు ఏమైంది. బహిష్కృతుడైన తిన్నడు తమ గూడాలను కాల ముఖుడు నుంచి ఎలా రక్షించుకున్నాడు. అలాగే నాస్తికుడైన తిన్నడు ఎలా భగవంతుడి మార్గంలోకి వచ్చాడు?
ఆ మార్గంలో శివుడు ఆజ్ఞతో వచ్చి వచ్చిన రుద్రుడు ఎవరు, తిప్పడుకు అతను ఏం బోధించాడు? చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ కథను మరీ ఇప్పటి జనరేషన్ యూత్ కు తెలుసు అని చెప్పలేం కానీ ఓ జనరేషన్ లో చాలా మందికి తెలుసు. అందులో కొందరు ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గ్రంధం చదివి ఉండవచ్చు లేదా భక్త కన్నప్ప సినిమా చూసి ఉండవచ్చు. దాంతో ఆ తెలిసిన మళ్లీ చెప్పటం ఎందుకు అని కొత్త అంశాలు కలుపుకుంటూ ఈ కథను తయారు చేసుకుంటూ వచ్చారు.
ఈ క్రమంలో ద్వాపర యుగంలోని అర్జునుడే ఆ తర్వాత తిన్నడిగా జన్మించాడని, పరమ శివుడు కిరాతుడిగా వచ్చి అర్జునుడి శక్తిని పరీక్షించి పాశు పతాస్త్రం ఇచ్చాడని చెప్పబడే విషయాలు అన్నీ వస్తాయి. అలాగే తిన్నడు నివాశం ఉండే గూడాలు, అక్కడ వాయులింగం, దాని కోసం యుద్దాలు ఇలాంటివి చాలా కలిసాయి. వీటిన్నటి కలయికతో ఈ కథ తన పరిథి దాటి పోయింది.
అసలు ఏదైతే ఈ సినిమాలో హైలెట్ ఎపిసోడో అదే సెకండాఫ్ కు నెట్టేసే పరిస్దితి వచ్చింది. కొన్ని అనవసరమైన యాక్షన్ బ్లాక్లు, ట్రైబల్ కంటెంట్ ఓవర్ డోస్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇంట్రవెల్ కు అయినా అసలు పాయింట్ లో వచ్చి ఉంటే ఫస్టాఫ్ ఇబ్బందిగా అనిపించేది కాదు.
కానీ క్లైమాక్స్ పార్ట్లో మళ్లీ సినిమా స్పిరిటువల్ ఎనర్జీ తెచ్చుకుంటుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత కథకు కొత్త ఊపొస్తుంది. ఆయన్ని ఒక మెస్సెంజర్లా చూపడం, డివోషన్ను ఓ యాక్షన్గా ఫీల్ చేయించడమే కథన విజయం.
ఓ రకంగా ఈ కథా ప్రయాణం అంతా ఫిజికల్ యుద్ధం కన్నా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ పై ఆధారపడి ఉంటుంది. కథలోని పెద్ద ప్లస్ ఏమిటంటే – హీరో డివైన్ కాలింగ్కు ఎలా స్పందించాడన్నదే!
ఎవరెలా చేసారు
ఈ సినిమాని మొత్తం మోసింది మంచు విష్ణు. ఎవరేమి అన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఓ డివైన్ టచ్ తో సినిమాని నడిపించారు. ఆయన నటన క్లైమాక్స్ లో పీక్స్ కు చేరింది. మోహన్ బాబు మంచి నటుడు అని తెలుసు కానీ మంచు విష్ణులో ఈ స్దాయి నటుడు ఉన్నాడని మొదటి సారి మనకు ఈ సినిమాలో ఆవిష్కారం అవుతుంది. ఇక ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి వారి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించేదేముంది. ప్రబాస్ లేకపోతే ఈ సినిమా లేదు అనిపించేలా ఆయన బుజాన ఎత్తుకున్నారు. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ గ్లామరస్ గా కనిపించింది.
టెక్నికల్ గా నూ ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. డైలాగులు చాలా జాగ్రత్తగా హత్తుకునే చోట హత్తుకునేలా, ఎలివేట్ చేసే చోట ఎలివేషన్స్ తో సరళంగా కామన్ ఆడియన్స్ కు కూడా అర్దమయ్యేలా రాసారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకెంచెం బాగుండాలి అనిపిస్తుంది.నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాల్లో విజృంభించింది మొత్తంగా, టెక్నికల్ టీమ్ యథాశక్తిగా సినిమాని ఎలివేట్ చేయడానికి శ్రమించింది.
ఓవరాల్ గా …:
ఇది కేవలం ఓ పురాణ కథను రీటెల్ చేసే ప్రయత్నం కాదు. మానవునిలోని దైవత్వాన్ని గుర్తించే ప్రయత్నం. కథలో లోతు ఉంది… కథనంలో కొన్ని ఫ్లాస్ ఉన్నా, పాయింట్ మాత్రం పవర్ఫుల్. ఇలాంటి కథలు మరిన్ని రావాల్సి ఉంది.