శ్రీను వైట్లకు ఇప్పుడు మార్కెట్ లేదు, క్రేజ్ అంతగా లేదు. గతంలో ‘దూకుడు’, ‘రెడి’, ‘వెంకీ’ లాంటి సూపర్ హిట్ కామెడీలతో తెలుగు ప్రేక్షకుడిని మైమరపింపజేసిన ఈ దర్శకుడు, తరువాత వరుసగా డిజాస్టర్లతో తన మార్కెట్ను కోల్పోయాడు. అయినా ఇప్పటికీ ఆయన మీద నమ్మకముంచి ఒక టాప్ ప్రొడ్యూసర్ అతనితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే అది చిన్న విషయం కాదు!
వివరాల్లోకి వెళ్తే—
ఐదేళ్ల గ్యాప్ తర్వాత గోపీచంద్తో ‘విశ్వం’ అనే సినిమా తీసిన శ్రీను వైట్లకు అదీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలిసిరాలేదు. అయితే బడ్జెట్కు అనుగుణంగా పని చేయగల దర్శకుడిగా ఆయనపై కొన్ని నిర్మాణ సంస్థలు నమ్మకం ఉంచుతూనే ఉన్నాయి. తాజాగా, మైత్రీ మూవీ మేకర్స్ అనే పెద్ద బ్యానర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిందట.
ఈ కొత్త స్క్రిప్ట్ను ‘సమాజవరగమన’, ‘సింగిల్’ వంటి హిట్ సినిమాలకు పని చేసిన రచయితలు భాను , నందు తయారు చేశారు. కథ సిద్ధమవ్వగానే శ్రీను వైట్ల, ఇద్దరు యంగ్ హీరోలను సంప్రదించాడట. వారితో చర్చలు చివరి దశలో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల మళ్లీ కామెడీ పంథాలోకి తిరిగి వస్తున్నాడా? హిట్ కొడతాడా? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.