పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, వెండితెర సుందరి బి.సరోజాదేవి (87) ఇకలేరు. సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాలపాటు దక్షిణ భారత సినీ ప్రపంచంలో రాజ్యమేలిన ఆమె, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ వంటి మహానుభావులతో కలిసి అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు.

1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి, కేవలం 13 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి ప్రవేశించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ద్వారా సినీ ప్రయాణం ప్రారంభమైంది. తెలుగులో ఆమెకు పేరు తెచ్చిన చిత్రాలు పాండురంగ మహత్యం, భూకైలాస్ కాగా, 1959లో పెళ్లిసందడి సినిమాతో ఆమెకు మంచి బ్రేక్‌ లభించింది.

సీతారామ కల్యాణం (1961), జగదేకవీరుని కథ (1961), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), దాగుడు మూతలు (1964), శకుంతల (1966), దానవీర శూర కర్ణ (1978), అల్లుడు దిద్దిన కాపురం (1991) వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో ఆమె ఆకట్టుకునే పాత్రలు పోషించారు.

1955 నుంచి 1984 వరకు, ఏకధాటిగా 29 సంవత్సరాల పాటు 161 సినిమాల్లో ప్రధాన కథానాయికగా నటించిన అనితరసాధ్య ఘనత ఆమెదే. ఆమె సినీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

#B. Saroja Devi, #Krishnarjuna Yudham, #Sitarama Kalyanam

By admin