ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు బలైంది. ఈసారి మాత్రం దారుణ స్థాయిలో ఆమెపై దాడులు జరిగాయి. రాయడానికి, చదవడానికి కూడా వీలు లేని పదాలతో చిన్మయి, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్లు చేశారు.

“నా పిల్లలు చనిపోవాలని అనడం ఏంటి?” – చిన్మయి ఆగ్రహం

ఈ నిరంతర వేధింపులతో విసిగిపోయిన చిన్మయి, నేరుగా హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది. “సర్‌, ఈ రోజువారీ ఆన్‌లైన్‌ వేధింపులతో విసిగిపోయాను. ఎవరికైనా నా అభిప్రాయం నచ్చకపోతే పట్టించుకోకపోవచ్చు, కానీ నా పిల్లలు చనిపోవాలని ఎలా అంటారు? వీళ్లను అలాగే వదిలేయలేను” అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.

సజ్జనార్‌ వెంటనే స్పందించి, చిన్మయి ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు.

అసలు వివాదం ఏంటంటే…

రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend) సినిమాకు చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించాడు. సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ రాహుల్‌ –

“మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది నా భార్య చిన్మయి ఇష్టం. నేను ఆమెపై బలవంతం చేయను,” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కొందరు ట్రోల్స్‌ దారుణంగా విరుచుకుపడ్డారు. “ఇలాంటివారికి పిల్లలు పుట్టకూడదు… పుట్టినా వెంటనే చనిపోవాలి” అనే స్థాయిలో కామెంట్లు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

చిన్మయి గట్టి వార్నింగ్‌

ట్రోలింగ్‌ ఆగకపోవడంతో చిన్మయి ట్విట్టర్‌ స్పేస్ నిర్వహించి, నేరుగా విమర్శకులను ఎదిరించింది. “అసభ్య కామెంట్లకు లైక్‌ కొట్టేవారు, ఎమోజీలతో నవ్వేవారు కూడా అదే నేరస్తులు” అని గట్టి హెచ్చరిక ఇచ్చింది.

చిన్మయి సందేశం

“చట్టాలు ఉన్నా సరే, మనసు మారకపోతే సమాజం మారదు. మహిళల పట్ల ఈ తక్కువ మనస్తత్వం మారకపోతే, సోషల్‌ మీడియా సురక్షిత స్థలం కాదు,” అని ఆమె చెప్పింది.

#Chinmayi Sripaada, #cyber crime, #singer chinmayi, #social media trolls, #VC Sajjanar

By admin