షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ యాజమాన్యంలో నడుస్తున్న ‘టోరీ’ రెస్టారెంట్లకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సార్థక్ సచ్దేవా వెళ్లాడు. అక్కడ రెస్టారెంట్లలో వడ్డించే పనీర్పై టెస్ట్ చేశాడు. అయితే టోరీ రెస్టారెంట్లో పనీర్ను పరీక్షించిన సమయంలో ఫేక్గా తెలిపాడు.
ఆర్డర్ ఇచ్చిన పనీర్పై అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేయగా.. నల్లగా మారడంతో ఫేక్గా చెప్పాడు. పనీర్తో సహా పలు ఆహార పదార్థాల్లో స్టార్చ్ను గుర్తించేందుకు అయోడిన్ టింక్చర్ టెస్ట్ చేయడం సాధారణ పద్ధతి. సహజంగా తయారు చేసిన పనీర్లో స్టార్చ్ ఉండకూడదని.. పనీర్తో స్టార్చ్ కలిసినప్పుడు అయోడిన్ నీలం-నలుపు రంగులోకి మారితే అది కల్తీగా పేర్కొంటారు.
‘షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రెస్టారెంట్లో వడ్డించే పనీర్ నకిలీదని తేలింది’ అంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం కాస్తా చర్చకు దారి తీసింది.
అయితే, దీనిపై టోరీ రెస్టారెంట్ స్పందించింది. ఈ మేరకు సచ్దేవా ఆరోపణలను తోసిపుచ్చింది. అయోడిన్ పరీక్ష స్టార్చ్ ఉనికిని ప్రతిబింబిస్తుంది తప్ప పనీర్ నాణ్యత ప్రామాణికతను కాదు అంటూ వివరణ ఇచ్చింది. వంటకంలో సోయా ఆధారిత పదార్థాలు ఉన్నందు వల్లే, అలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
అంతేతప్ప, అది నకిలీదికాదని స్పష్టతనిచ్చింది. తమ పనీర్ చాలా స్వచ్చమైందనీ, టోరీలో వడ్డించే పదార్థాలన్నీ నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది. నకిలీ పనీర్ వడ్డిస్తున్నారనే వార్త విని ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.తాము అందించే పనీర్ నాణ్యమైందని స్పష్టం చేసింది. దీనిపై గౌరీఖాన్ మాత్రం స్పందించలేదు.