రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం ప్రముఖ నటి తమన్నా భాటియాను ‘మైసూర్ శాండల్ – శ్రీగంధ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. తమన్నాకు కర్ణాటకతో ఎలాంటి నెరిసిన సంబంధాలు లేవని, స్థానిక కన్నడ హీరోయిన్ కే ఈ గౌరవాన్ని ఇవ్వాలని ప్రజలు మరియు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ముమ్మరంగా స్పందిస్తున్నారు. తాజాగా ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమన్నాకు కన్నడ రాదని, ఆమె స్థానంలో స్థానిక వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తమన్నాను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

“నా పూర్వీకుడు కృష్ణరాజ ఒడేయర్ 1916లో స్థాపించిన మైసూర్ శాండల్ కంపెనీకి ఒక వేరే భాష నటి ముఖంగా ఉండటం బాధాకరం,” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఇక సామాన్య ప్రజల అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కన్నడ సంస్కృతి, భాష, సంప్రదాయాల పట్ల అవగాహన లేని వ్యక్తికి రూ. 6.2 కోట్ల పారితోషికం చెల్లించి బ్రాండ్ అంబాసిడర్ చేయడమంటే అవమానమేనని అంటున్నారు.

ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకూ ఈ చర్చ మళ్లీ మళ్లీ తెరపైకి రావడం ఖాయం.

#Mysore Sandal Soap, #Tamannaah Bhatia

By admin