తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్‌లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు గద్దర్ అవార్డులకు ఎంపికైనా… వారు ఎవ్వరూ ఆ వేడుకకు హాజరుకాలేదు. ఇంకా కొన్ని పెద్ద హీరోలు కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. ఈ కారణంగా స్టార్ హీరోలపై దిల్ రాజు అసహనం వ్యక్తం చేసారు..

ఈ అవార్డులు ప్రభుత్వ స్థాయిలో ఇస్తున్న అవార్డులు కావడంతో, చిత్ర పరిశ్రమలోని ప్రతీ ఒక్కరూ పాల్గొనాల్సిన బాధ్యత ఉందని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్‌లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ & ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. గద్దర్ సినీ పురస్కారాల వేడుక ఘనవిజయాన్ని పురస్కరించుకుని మాట్లాడిన ఆయన, ఒక కీలకమైన విజ్ఞప్తి చేశారు – ఇకపై ప్రభుత్వం నిర్వహించే పురస్కార వేడుకలకు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరుకావాలని కోరారు.

“సినిమా వాళ్లందరూ ప్రభుత్వాలతో కలిసి నడవాల్సిన బాధ్యత ఉంది” – దిల్ రాజు

“గద్దర్ అవార్డుల కోసం ఆరు నెలలుగా మేం శ్రమించాం. వేడుక విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో సహకారం అందించారు. 2.15 గంటల పాటు ఆయన వేడుకలో పాల్గొనడం గొప్ప విషయం. మా ప్రణాళిక ప్రకారం ఇది నాలుగు గంటల కార్యక్రమం. సీఎం గారు చివరి వరకూ ఉండాలని నేను స్వయంగా అభ్యర్థించాను,” అని దిల్ రాజు తెలిపారు.

దిల్ రాజు వాఖ్యాలు మరింత స్పష్టంగా ఏం చెబుతున్నాయి అంటే —

“ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అవార్డు కార్యక్రమాలకు ఎవరు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా… వచ్చి పాల్గొనాల్సిందే. అది మన బాధ్యత. మన సినిమాల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయంటే, మనం కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.”

సినిమావాళ్లకు ఓ విజ్ఞప్తి

“మీ డైరీల్లో తేదీ నోట్ చేసుకోండి. మీకు వచ్చిన అవార్డులను స్వీకరించండి. ఇది ప్రైవేట్ అవార్డు కాదు – ప్రభుత్వ అవార్డు. చిత్రపరిశ్రమ, ప్రభుత్వం కలిసి వ్యవహరించాల్సిన అవసరం ఉంది,చిత్ర పరిశ్రమకు ఇది నా విజ్ఞప్తి. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా” అని పేర్కొన్నారు.

ఈ వేడుక విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ పురస్కారాల వేడుకపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీసేలా ఉన్నాయి.

“మంచి సినిమా తీసే బాధ్యతే కాదు… ప్రభుత్వ పిలుపుకు స్పందించే బాధ్యత కూడా మనదే” అనే సందేశాన్ని దిల్ రాజు ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పారు.

, , , , ,
You may also like
Latest Posts from