పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన సినిమాల పరంపరలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ను పూర్తి చేసిన పవన్, తాజాగా ‘ఓజీ’ సినిమాకు డేట్లు ఇచ్చి, దాన్ని కూడా పూర్తి చేసే దశలో ఉన్నారు. అంతేకాకుండా, ‘ఉస్తాద్’ చిత్రంలోనూ పవన్ కీలక పాత్రలో పాల్గొంటున్నారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, పవన్ మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈసారి ఆయనకు కథ చెప్పిన వ్యక్తి తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని.
పవన్, సముద్రఖని కాంబినేషన్లో ఇప్పటికే ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా పవన్ అభిమానులకు ఒక ఎమోషనల్ టచ్ కలిగించినా, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే అప్పటికే సముద్రఖనితో మరో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారని సమాచారం.
ఇప్పుడు ఆ మాట నెరవేర్చే సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ కథను తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్లో పూర్తి చేయొచ్చని ప్లాన్. ముఖ్యంగా, పవన్ దగ్గర అడ్వాన్సులు ఇచ్చిన కొన్ని బ్యానర్లకు ఇంకా ప్రాజెక్టులు బకీగా ఉండటంతో, ఆ బాధ్యతను తీర్చేందుకు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారట. ఈ మధ్యే సముద్రఖని – పవన్ కలసి కథ చర్చలు జరిపారని తెలిసింది.
‘ఉస్తాద్’ పూర్తయ్యాక, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇదిలా ఉండగా, త్రివిక్రమ్ కూడా పవన్ కోసం కథలు వింటూ ఉన్నారని తెలుస్తోంది. పవన్ మూడ్, అందుబాటును బట్టి — అతనికి తగిన కథ రెడీ చేసి, మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలన్నదే త్రివిక్రమ్ లక్ష్యం.