ఏపీ ప్రభుత్వం మారినా, కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించినా – టాలీవుడ్ నుంచి ఏడాది కాలంగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. సినిమాలపై అనేక సమస్యలు, ప్రభుత్వ సహకారంపై ఎన్నో ఆశలు ఉండగానే… పరిశ్రమ మాత్రం నిశ్శబ్దంగానే ఉంది. అయితే… ఈ నిశ్శబ్దాన్ని పగలగొట్టారు పవన్ కళ్యాణ్.
గతంలో జరిగిన థియేటర్ బంద్, బాయ్కాట్ కధనాలపై మండిపడి, “ఇలా ఊరుకోం… ప్రభుత్వం మారిందంటే, వ్యవహారం కూడా మారాలి” అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ ఒక్క మాటతో… టాలీవుడ్ పెద్దలు ఒక్కసారిగా కదిలారు. చంద్రబాబుతో భేటీకి సన్నద్ధమయ్యారు.
ఏపీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ఏడాది గడిచాక టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబుతో మొదటి భేటీకి సిద్ధమయ్యారు. జూన్ 15న అమరావతిలో ఈ ముఖ్య సమావేశం జరగబోతోంది. సినిమా రంగ అభివృద్ధిపై చర్చించేందుకు ఉండవల్లిలోని సీఎం నివాసంలోనే ఈ మీటింగ్ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహించనున్నారన్న మాట వినిపిస్తోంది.
ఇటీవల థియేటర్ బంద్, ఆన్లైన్ టికెటింగ్, సినిమాల విడుదల తేదీల వెనుక రాజకీయ కుట్రలు జరిగినట్లు టాలీవుడ్లోని కొంతమంది భావించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ సినిమాపై కూడా వ్యవస్థబద్ధంగానే అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాలపై పవన్ ఓపెన్గా స్పందిస్తూ… “గత ప్రభుత్వం వేధించినా సహనంగా స్పందించాం, కానీ మా మీద కుట్రలు చేస్తే మౌనంగా ఉండం” అని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ ఇప్పుడు నూతన ప్రభుత్వానికి దగ్గరవ్వాలని భావిస్తోంది. కానీ అసలు ప్రశ్న ఇంకొకటి – ఇండస్ట్రీ మొత్తం కలిసివస్తుందా? లేదా మళ్ళీ పాత చీలికలు తెరపైకి వస్తాయా?
గతంలో కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు అప్పటి అధికార పార్టీకి దగ్గరగా ఉండటం వల్ల, చంద్రబాబు లాంటి నేతలతో సమావేశాలకు వెనుకంజవేశారని వాదనలు వినిపించాయి.
అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, “కలుద్దామంటే – మనం ప్రైవేట్ వ్యాపారులం, కలవాల్సిన అవసరం లేదన్నారు” అని అన్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వంతో సహకారం తప్పనిసరి. టికెట్ ధరలు, టాక్స్ విధానాలు, థియేటర్ల భవితవ్యంపై స్పష్టత కోసం సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఇండస్ట్రీకి బాగా ఉంది. దాంతో ఈ భేటీకి రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యం కలుగుతోంది.
ఈసారి టాలీవుడ్ నాయకత్వం ఒక్కటిగా ముందుకు వస్తుందా లేక మళ్లీ పాత విభజనలు మళ్ళీ తలెత్తుతాయా అన్నది పరిశ్రమలో చర్చగా మారింది.