సినిమా ఆడియో లాంచ్ అంటే పాటల సందడి మాత్రమేనా… లేక రాజకీయ వేదికగా మారిపోతుందా? ఇటీవల హీరోల ఈవెంట్ల చుట్టూ జరుగుతున్న చర్చల మధ్య, ఇప్పుడు విజయ్ పేరు కూడా హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టీవీకే అనే పార్టీని స్థాపించిన ఆయన, మరోవైపు సినిమాలపైనా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జననాయగన్ సినిమా, తెలుగులో జననాయకుడు పేరుతో వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

రిలీజ్ దగ్గరపడుతుండటంతో, ఈ నెల 27న మలేషియాలోని కౌలాలంపూర్‌లో గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి వేలాది అభిమానులు హాజరవుతారని సమాచారం.

అయితే ఈ ఈవెంట్ విషయంలో మలేషియా పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఆడియో లాంచ్ వేదికపై రాజకీయ ప్రసంగాలు, రాజకీయ బ్యానర్లు వాడకూడదని స్పష్టం చేశారు. ఇటీవల సినిమా ఈవెంట్లలో రాజకీయ వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై నెటిజన్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్‌ను సినిమాకే పరిమితం చేయడం మంచిదేనని, ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు అవసరమేనని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక జననాయగన్ సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా విజయ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

#Jana Nayagan Audio Launch, #police warning, #Pooja Hegde, #Thalapathy Vijay, #Vijay

By admin