పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ, వాటిలో మొదటగా విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం మేరకు, ఈ సినిమా వచ్చే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే మరో ప్రత్యేకత ఏంటంటే — “యోగి” (2007) తర్వాత ప్రభాస్ కు ఇది మొదటి సంక్రాంతి విడుదల! అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత అతను ఈ పండుగ సీజన్ను టార్గెట్ చేయడం విశేషం.
అయితే, ‘ది రాజాసాబ్’తొలుత డిసెంబర్ 5న విడుదల అవుతుందని ప్రకటించినా, కొన్ని పనులు ఆలస్యం కావడంతో చిత్రబృందం సంక్రాంతి రిలీజ్ వైపు మళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
“వర్షం” (2004), “యోగి” (2007) తర్వాత ఇది ప్రభాస్కు మూడవ సంక్రాంతి రిలీజ్ కావడం గమనార్హం. ఇక ఈ చిత్రం జానర్, టార్గెట్ ఆడియన్స్ లను దృష్టిలో పెట్టుకుంటే… పండగ సీజన్లో విడుదల కావడం బాక్సాఫీస్ పరంగా పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.
మరో ప్రక్క ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వినోద ప్రధానంగా సాగే ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్లో ప్రభాస్ రెండు కోణాలున్న పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఆయనకు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.