మీటూ ఉద్యమానికి భారతదేశంలో నాంది పలికిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మళ్లీ వార్తల్లోకెక్కింది. గత కొద్దికాలంగా వెలుగులోకి రాకుండా మౌనంగా ఉన్న ఆమె, తాజాగా ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీస్తున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ –
“వీడియో వైరల్ అయిన నాటి నుంచి నా ఫోన్ ఆగటం లేదు. అందరూ ఇంటర్వ్యూలు కావాలంటున్నారు. కానీ నేను ఇక ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మికత వైపు మళ్లాను. ఆరోగ్య సమస్యలు ఉన్నా, సమయం కేటాయిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. కానీ దయచేసి నాకు కొంత శాంతిని ఇవ్వండి” అని ఆమె విజ్ఞప్తి చేసింది.
అంతటితో ఆగకుండా ఆమె మరో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహాటంగా మాట్లాడుతూ –
“బాలీవుడ్ మాఫియా ముఠా ఎంతో శక్తివంతంగా ఉంది. ముంబైలో నా ప్రాణాలకు ముప్పు ఉంది. నాకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పరిస్థితి మళ్లీ ఎదురవుతుందోమో తెలియదు. అదే విధంగా నన్నూ హత్య చేయాలని కుట్రలు జరుగుతున్నాయి” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
ఇవి విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్ మాఫియాపై చర్చ రేగింది.
ఇదీ తనుశ్రీ దత్తా గత కథ…
2018లో తనుశ్రీ దత్తా బాలీవుడ్ నటుడు నానా పటేకర్పై మీటూ ఆరోపణలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ షూటింగ్ సమయంలో నానా తనపై అసభ్యంగా ప్రవర్తించారని, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ రాకేష్ సారంగ్, నిర్మాత సమీ సిద్దిఖీ ఆమెను సమర్థించలేదని ఆరోపించారు.
అయితే, 2019లో ముంబయి పోలీసులు ఆధారాలేమీ లేవన్న కారణంతో నానా పటేకర్కు క్లిన్ చిట్ ఇచ్చారు.
2025 మార్చిలో ముంబయి మేజిస్ట్రేట్ కోర్టు ఆమె వేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను తిరస్కరించింది. ఘటన 2008 నాటిదైనందున చట్టపరంగా గడువు ముగిసిందని కోర్టు పేర్కొంది.
ఇప్పుడు ఆమె ఆరోపణలు, వ్యక్తపరుస్తున్న భయాలు బాలీవుడ్లో కొత్త చర్చకు నాంది పలికేలా ఉన్నాయి. ఆమె ఆరోగ్యానికి భద్రత కల్పించాలని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.