సోషల్ మీడియా అంటే ఏదైనా రాయొచ్చు, ఎవరినైనా వేధించొచ్చు అనుకునే వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్ ఇది! స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఆమె ఫోటోలను అసహ్యంగా మార్ఫింగ్ చేసినా ఇక చల్తా అని పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అనసూయ ఫిర్యాదుతో కడపకు చెందిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ట్రోలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

టాలీవుడ్ సెన్సేషనల్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. అయితే, కొందరు వ్యక్తులు హద్దులు దాటి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అసభ్యకరమైన వీడియోలు సృష్టించడం శృతిమించింది. దీంతో విసిగిపోయిన అనసూయ, 2025 డిసెంబర్ 23న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై సీరియస్ అయిన పోలీసులు తాజాగా ఒక నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

అసలు ఏం జరిగింది? :

అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాదాపు 73 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో సోషల్ మీడియా యూజర్లు మాత్రమే కాదు, కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఉండటం సంచలనంగా మారింది. 22 పేజీల భారీ ఎఫ్ఐఆర్‌తో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు, మార్చి 13న కడప జిల్లాకు చెందిన జనార్ధన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనసూయ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన కామెంట్స్ పెట్టినట్లు విచారణలో తేలడంతో అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద చర్యలు చేపట్టారు.

ట్రోలర్లకు హెచ్చరిక:

నిందితుడు జనార్ధన్ అనసూయ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడమే కాకుండా, ఆమెను మానసిక క్షోభకు గురిచేశాడని పోలీసులు నిర్ధారించారు. కేవలం ఒకరిని అరెస్ట్ చేయడంతో పోలీసులు ఆగడం లేదు, మిగిలిన 72 మందిపై కూడా వేట మొదలైంది. సోషల్ మీడియాలో ముఖం చాటుకుని సినీ తారలపై అశ్లీల పోస్టులు పెడితే భవిష్యత్తు అంధకారమవడమే కాకుండా, జీవితాంతం జైలు పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సినీ సెలబ్రిటీలైనా, సామాన్యులైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేయడం నేరం. అనసూయ చూపించిన ఈ ధైర్యం మిగిలిన బాధితులకు ఊపిరినిస్తోంది. ఇప్పటైనా ఆన్ లైన్ వేధింపులకు పాల్పడే వారు తమ పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి. ఏది ఏమైనా, అనసూయ ఫిర్యాదుతో మొదలైన ఈ ప్రక్షాళన సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే రేపుతోంది!

#Anasuya Bharadwaj, #Anasuya’s Legal Battle, #Social Media Trollers

By admin