పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఈ దాడులు చేసినట్లు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలుకుతోంది. ‘భారత్ మాతా కీ జై’, ‘మేమంతా మీ వెంటే’ అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్ట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు (Operation Sindoor) గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసిందని చెప్పారు.
ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు.
‘‘పహల్గాంలో హిందువులా?కాదా? అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉంది. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలి.. అండగా నిలవాలి. చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు ఆయన పోరాటం ఆగదు. పాకిస్థాన్కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి. భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.
తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ (Mohanlal) పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘‘మేం సిందూరాన్ని సంప్రదాయ తిలకంగా మాత్రమే కాదు.. మా అచంచలమైన సంకల్పానికి చిహ్నంగా కూడా ఉపయోగిస్తాం. మాకు ఎన్ని సవాళ్లు ఎదురైనా.. నిర్భయంగా, గతం కంటే బలంగా వస్తాం. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, బీఎస్ఎఫ్లోని ప్రతీ ధైర్యవంతుడికి వందనాలు. మీ అందరి ధైర్యం మా గర్వాన్ని మరింత పెంచుతుంది. మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది. జైహింద్’’ అని మోహన్లాల్ పోస్ట్ పెట్టారు.
‘ఆపరేషన్ సిందూర్’పై మరికొందరు సినీ ప్రముఖుల స్పందనలివీ…
‘‘తగిన న్యాయం జరిగింది. మేరా భారత్ మహాన్. సైనికులకు సెల్యూట్’’ - మహేశ్బాబు
‘‘మన ఆర్మీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. జైహింద్’’ - ఎన్టీఆర్
పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్ – రజనీకాంత్
న్యాయం జరిగింది… జైహింద్ – అల్లు అర్జున్
‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మాత్రమే భారత్ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. మన దేశం లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో సంయమనం పాటించింది. 26 మందిని దారుణంగా చంపినందుకు మాత్రమే ఈ చర్యలు జరిపింది. మేం నిబద్ధతకు కట్టుబడి ఉంటాం’’ – ప్రకాశ్ రాజ్
ప్రస్తుతం ప్రతి కదలిక పైనా దృష్టిపెట్టాలి. అన్నిటినీ నిశితంగా పరిశీలించాలి. – విశ్వక్సేన్
జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై.. – రితేశ్ దేశ్ముఖ్
భారత్ మాతా కీ జై.. న్యాయం జరిగింది – ఖుష్బూ
భద్రతా దళాలకు మరింత బలాన్నివ్వాలని ప్రార్థిద్దాం. ఒకే దేశం.. కలిసి నిలబడదాం. వందేమాతరం – మధుర్ భండార్కర్
‘‘ప్రజల భద్రత కోసం ప్రార్థిద్దాం. ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. ప్రశాంతంగా, సుసంపన్నంగా జీవిద్దాం. జై హింద్ ’’ – విజయ్ దేవరకొండ
‘‘రియల్ హీరోలకు సెల్యూట్. దేశం కోసం ఇండియన్ ఆర్మీ ఏం చేయగలదో ‘ఆపరేషన్ సిందూర్’తో మరోసారి రుజువైంది. దేశం గర్వపడేలా చేశారు. జైహింద్’’ - మమ్ముట్టి
‘‘సాయుధ దళాలు ఒక్కటైన వేళ.. గర్వంగా ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక సైనిక చర్యను అభినందిస్తున్నా’’ - కమల్ హాసన్
‘‘జైహింద్.. ఆపరేషన్ సిందూర్’’ - నాని
‘‘పహల్గాం ఉగ్రదాడికి సమాధానం ‘ఆపరేషన్ సిందూర్’. జైహింద్’’ - కల్యాణ్రామ్
‘‘ఇదీ భారతసైన్యం.. జైహింద్’’ - శివ కార్తికేయన్