
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఆయన సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, అలాగే ప్రముఖ ఓటిటి సంస్ద నెట్ఫ్లిక్స్కు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
వాంఖడే, నెట్ఫ్లిక్స్లో విడుదలైన “The Bads of Bollywood” వెబ్సిరీస్ తన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించి, రెడ్ చిల్లీస్, యజమానులు షారుక్ & గౌరీ ఖాన్ల నుంచి ₹2 కోట్లు నష్టపరిహారం కోరారు. ఆ మొత్తాన్ని టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్కు విరాళంగా ఇవ్వాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
రెడ్ చిల్లీస్ యజమాని గౌరీ ఖాన్ తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ నోటీసులు రావడం గమనార్హం.
నెట్ఫ్లిక్స్, ఎక్స్, గూగుల్, మెటా ప్లాట్ఫారమ్లు, ఆర్పీఎస్జీ లైఫ్స్టైల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, జాన్ డోలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రతివాదులు ఏడు రోజుల్లోగా సమాధానాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంఖడేకు సూచించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
వాంఖడే తరఫున సీనియర్ లాయర్ సందీప్ సేథి వాదనలు వినిపించారు. పరువు నష్టం కేసు తర్వాత తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకుంటున్నారని, భార్యను, సోదరిని ట్రోల్ చేస్తున్న పోస్టులు విస్తృతంగా ఉన్నాయని వాంఖడే తెలిపారు.
వాదనల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది —
“కేవలం ఆరోపణలతో వెబ్సిరీస్ను నిషేధించడం సాధ్యం కాదు. నిషేధానికి స్పష్టమైన ఆధారాలు అవసరం,” అని కోర్టు వ్యాఖ్యానించింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్సిరీస్కి దర్శకత్వం వహించింది ఆర్యన్ ఖాన్, అంటే షారుక్ ఖాన్ కుమారుడు!
