హెచ్సీయూ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి, వన్యప్రాణులను చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించారని.. వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని తెలంగాణా ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు.
సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ ఇమేజ్లు, వీడియోలు క్రియేట్ చేశారని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు.
ఇక ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను కంచ గచ్చిబౌలి పరిస్థితులను తెలియజేసే నకిలీ ఏఐ ఫొటోలు/వీడియోలను ఉపయోగించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తి తప్పుడు ప్రకటనగా ఆమె పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా దియా మిర్జా స్పష్టం చేశారు.
The CM of Telangana posted a tweet yesterday. He made certain claims about the situation at Kancha Gachibowli.
— Dia Mirza (@deespeak) April 6, 2025
One of them was that I had used FAKE AI generated images/videos in support of the protest by students to protect biodiversity on the 400acres of land the government…
“తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి వద్ద పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు. వాటిలో ఒకటి, ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవవైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ ఏఐ రూపొందించిన చిత్రాలు/వీడియోలను ఉపయోగించానని అన్నారు.
ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను ఏఐ రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. మీడియా, తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి” అని దియా మిర్జా ట్వీట్ చేశారు.