ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు ఏ విషయం మాట్లాడినా అది సంచలనమే. ఆయన రాజకీయాల్లో, సినిమాల్లో వేళ్లూనుకుపోయిన ‘వారసత్వ సంస్కృతి’పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేవలం నాలుగైదు కుటుంబాలే రాష్ట్రాన్ని, సినిమా రంగాన్ని శాసించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ విమర్శల మధ్యే ఆయన నేటి తరం నటి కీర్తి సురేష్‌ను ఆకాశానికెత్తేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

“అమ్మా.. నీకు నమస్కారం!” – గరికపాటి భావోద్వేగం

వారసత్వంతో వచ్చి కేవలం గంతులు వేసే హీరోల మధ్య, అసలైన నటన అంటే ఎలా ఉంటుందో కీర్తి సురేష్ చూపించిందని గరికపాటి ప్రశంసించారు. “నటన అంటే ఎలా ఉంటుందో నేను ‘మహానటి’ సినిమాలో చూశాను. ఆ అమ్మాయి కీర్తి సురేష్‌కు నమస్కారం అమ్మ.. శతాయుర్భవ!” అంటూ ఆయన ఆశీర్వదించారు.

సినిమాలో కీర్తి సురేష్ నటన చూసి అచ్చం సావిత్రి గారే మళ్లీ దిగివచ్చారా అనిపించిందని, ఆమె నటన తనను ఆశ్చర్యపరిచిందని కొనియాడారు. వారసత్వంగా వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారి మధ్య, ఇలాంటి ప్రతిభావంతులైన నటులు ఉండటం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

వారసత్వ హీరోలపై గరికపాటి సెటైర్లు!

సినిమా రంగంలో ప్రస్తుతం నటన కంటే ‘ఎగరడం’ (డాన్సులు, ఫైట్లు) ఎక్కువైపోయిందని గరికపాటి ఎద్దేవా చేశారు. కొడుకులను, మనవలను ఇంకా ఎంతకాలం మనం భరిస్తూ ఉండాలి? సామాన్యులకు ఇక్కడ బతికే అవకాశం లేదా? అని నిలదీశారు. హీరో అంటే కేవలం ఎగరడం, హీరోయిన్ అంటే వాడి పక్కన గంతులు వేయడం మాత్రమే అయిపోయిందని, అక్కడ అసలైన నటన ఎక్కడుందని ప్రశ్నించారు.

వారసత్వ పోకడలను వ్యతిరేకించే గరికపాటి గారు, ఒక నటి ప్రతిభను గుర్తించి అంతలా మెచ్చుకోవడం విశేషం. రాజకీయాల్లోనైనా, సినిమాల్లోనైనా వారసత్వానికి స్వస్తి పలికి, ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన పిలుపునిచ్చారు. మరి గరికపాటి వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి!

#garikapati, #garikapati narasimha rao, #keerthy suresh, #Mahanati, #Tollywood

By admin