టాలీవుడ్ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై Enforcement Directorate (ED) రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులు నమోదయ్యాయి.
ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల వంటి పేర్లు ఉండటం టాలీవుడ్లో చర్చకు తెరదీశింది. వీరంతా భారీగా పారితోషికాలు తీసుకుని నిషేధిత యాప్లను ప్రచారం చేశారని ఆరోపణలు. వీరి ప్రచారంతో వేలాది మంది యువత బలయ్యారని పోలీసులు పేర్కొన్నారు.
గతంలో సైబరాబాద్ పోలీసులే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో వీరు ఇచ్చిన ప్రమోషన్లు యువతను మాయమాటల్లో పడేసినట్లు దర్యాప్తు తెలిపుతోంది.
సెలెబ్రిటీ యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, పలు బుల్లితెర నటులు, యూట్యూబ్ స్టార్లు కూడా ఈ కేసులో ఆరోపణల పాలయ్యారు. తెలంగాణ గేమింగ్ చట్టం, ఐటీ చట్టం కింద కేసులు నమోదై ఉండగా, ఇప్పుడు ఈడీ విచారణతో మరింత ఉగ్రరూపం దాల్చిన ఈ కేసులో, త్వరలోనే విచారణ నిమిత్తం వీరందరినీ పిలవనున్నారు.