‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్క్లూజన్’ సినిమాలను ఒకే సినిమాలో కూర్చి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే… ఈ ఎడిటింగ్ ప్రయాణం ఎంత కఠినమైందో రాజమౌళి స్వయంగా చెబుతున్నారు.
“బాహుబలి లో ప్రతి సీన్, ప్రతి పాట నా గుండెలో చెరగని ముద్ర వేసింది. కానీ ఒకే వెర్షన్ చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. ఏం తొలగించాలి? ఏం ఉంచాలి? అనే విషయంలో రోజులు రోజులు చర్చలు జరిగాయి, వేడెక్కిన వాదోపవాదాలు జరిగాయి. ఇదే నా కెరీర్లోనే కఠినమైన నిర్ణయ ప్రక్రియ” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
రాజమౌళి మాట్లాడుతూ… ‘‘బాహుబలి: ది ఎపిక్’ రిలీజ్ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్. రెండూ కలిపి దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్టైమ్ ఉన్నాయి. వీటిని కట్ చేసి ఒక భాగంగా విడుదల చేయాలి. ఏ సన్నివేశాలను ఉంచాలి? వేటిని తీసేయాలి? అనే విషయంపై మేం తీవ్రంగా చర్చించుకున్నాం. ‘బాహుబలి’లోని ప్రతి సన్నివేశం, పాట నాకు విలువైనదే. దేన్ని తీసేయాలో అర్థం కాలేదు. నిడివి తగ్గించాలంటే కొన్ని కట్ చేయక తప్పదు.
అందుకే పాట, కొన్ని సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించాం. ‘కన్నా నిదురించరా’ పాటను కట్ చేశాం. అలాగే, ప్రభాస్-తమన్నా (Prabhas – Tamanna) మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాం. ‘బాహుబలి: ది ఎపిక్’తో ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నా’’ అని రాజమౌళి తెలిపారు.
ఈ క్రమంలో ప్రభాస్ – తమన్నా రొమాంటిక్ ట్రాక్ మొత్తం తొలగించబడిందనే టాక్ వినిపిస్తోంది. కొన్ని పాటలు కూడా కొత్త వెర్షన్లో కనిపించవు.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా, ఫైనల్ రన్టైమ్ దాదాపు 4 గంటలు ఉండబోతోందట.