తను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అతడిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఎవరు అతను, ఏం జరిగింది.
ఓవైపు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత విజయశాంతి నటించిన సినిమా ఇది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమా ప్రచారంతో కాకుండా, మరో వివాదంతో వార్తల్లోకెక్కారు విజయశాంతి.
చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ చంద్రకిరణ్ రెడ్డి ఎవరో తెలుసా?
విజయశాంతి భర్త ఎం. వి శ్రీనివాస ప్రసాద్కు నాలుగేళ్ల క్రితం ఎం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చంద్రకిరణ్ చెప్పుకున్నాడు.
పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్కు శ్రీనివాస ప్రసాద్ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఎగ్రిమెంట్ చేసుకోకుండా పంపించేశారు.
కానీ, చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్నాని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు.
ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి మాట్లాడాలని శ్రీనివాస్ ప్రసాద్ మెసేజ్లో సూచించగా, అతడు రాలేదు. ఇటీవల నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు కీడుస్తా.. కసితీరే వరకు అతి దారుణంగా చంపుతాను అంటూ చంద్ర కిరణ్ రెడ్డి మెసేజ్ ద్వారా బెదిరించాడు.