“మీ బ్రాండ్ ఎంత పెద్దదైనా సరే, మీ బ్యాగ్రౌండ్ ఎంత బలమైనదైనా సరే, తెరపై కనిపించే కంటెంట్ సరిగా లేకపోతే బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పదు.” ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఇటీవల విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. వరుసగా ‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి యూత్ఫుల్ హిట్స్తో, అలాగే ‘సింగిల్’లో క్యామియోతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న నితిన్ నార్నె కెరీర్కు ఈ సినిమా ఊహించని బ్రేక్ వేసింది.
జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా పరిశ్రమకు పరిచయమైన నితిన్, తన అప్రోచ్తో యూత్ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. కానీ, ఈ సినిమా మాత్రం అతని విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది.
మూడేళ్ల నిరీక్షణ… పబ్లిసిటీకి దూరం: కారణం ఏంటి?
నితిన్ నార్నె కెరీర్కు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ తొలి సినిమా అని చాలామందికి తెలియదు. ఈ సినిమా మూడేళ్ల క్రితమే మొదలై, దాదాపు రెండేళ్లు ల్యాబ్లో మగ్గి ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. సినిమా విడుదలయ్యే సమయానికి, నితిన్ ఇప్పటికే మూడు హిట్లతో స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. కానీ, ఆశ్చర్యకరంగా, తన తొలి సినిమా ప్రమోషన్లకు నితిన్ పూర్తిగా దూరంగా ఉన్నాడు.
శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డు చిత్రాన్ని తీసిన దర్శకుడు సతీష్ వేగ్నేశ స్వయంగా రావు రమేష్తో కలిసి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అవి ఏమాత్రం జనంలోకి వెళ్లలేదు. సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలామందికి తెలియలేదు. దీనికి ప్రధాన కారణం, నితిన్కు సినిమా ఫలితంపై ముందే ఒక స్పష్టమైన అంచనా ఉండడమే. ఒక అంచనా ప్రకారం, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కాకూడదని నితిన్ భావించాడట. తను ఊహించినట్లుగానే, ఫలితం తలకిందులైంది.
ప్రేక్షకులు ఎందుకు నిరాకరించారు?
‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ కథాంశంపై వస్తున్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఒక యువకుడు తన ప్రియురాలి కోసం విపరీతమైన పొగతాగే అలవాటును వదులుకోవడానికి చేసే ప్రయత్నం ఈ సినిమా ప్రధానాంశం. ఈ పాయింట్ వినడానికి సింపుల్గా ఉన్నా, స్క్రీన్ ప్లే, కథనం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది.
గతంలో, కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ కూడా ఇదే తరహా పాయింట్తో వచ్చి పరాజయం పాలైంది. అంటే, కేవలం ఒక సింగిల్ పాయింట్ చుట్టూ కథ అల్లడం కాకుండా, దానిని ఆసక్తికరంగా, నమ్మశక్యంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్, డ్రామా, లాజిక్ లేకపోతే ఎంత చిన్న సినిమా అయినా, ఎంత పెద్ద హీరో అయినా సరే అంగీకరించరని ఈ సినిమా మరోసారి నిరూపించింది