పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మొదలయ్యి చాలా కాలం అయ్యింది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమాని మొదట ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని ప్రకటించినా… వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా 2026 సంక్రాంతికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కొత్త సమస్య వచ్చి పడింది. ఢిల్లీకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్స్ ‘ది రాజాసాబ్’ నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ ఎగ్రిమెంట్ ని ఉల్లంఘించారని, సినిమా సమయానికి పూర్తి చేయకపోవడం, నిధుల వినియోగాన్ని వివరించకపోవడం, ముఖ్య బాధ్యతలను ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ పూర్తి చేయలేదని కోర్టును విన్నవించింది.
IVY ఎంటర్టైన్మెంట్స్ చెప్పేదేమిటంటే… ‘’ది రాజాసాబ్’ మూవీ కోసం తాము రూ.218 కోట్లు పెట్టుబడి పెట్టాం. వరల్డ్ వైడ్గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మూవీని ఎలాంటి పోటీ లేని టైంలో సింగిల్గా రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇప్పటికీ ఆలస్యం అవుతుంది. షూటింగ్స్పై ఎలాంటి అప్డేట్స్ లేవు. మేము అనుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు.’ అంటూ ఆరోపించింది. తమకు న్యాయం చేయాలంటూ కోర్టును కోరింది.
ఈ మూవీ కోసం అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టామని… వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు సంస్థ తెలిపింది. తాము పెట్టిన పెట్టుబడికి 18 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ పిటిషన్ వేసింది. అంతవరకూ ఈ మూవీపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎలాంటి హక్కులు ఉండకుండా చూడాలని… ఎలాంటి బిజినెస్ లావాదేవీలు జరగకుండా ఆదేశాలివ్వాలని కోరింది. మరి దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ, దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అసలు మూవీ వాయిదా పడిందా లేదా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ, ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఫ్యాన్స్ ‘వింటేజ్ ప్రభాస్’ ఎక్స్పీరియన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.