యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ (Ajey The Untold Story of a Yogi). ఈ సినిమాకు సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ నిరాకరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీనిపై దర్శక నిర్మాతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదనలు , విచారణలు అనంతరం “అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి” విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బాంబే హైకోర్టు.
ఇక సెన్సార్ బోర్డు ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించి, అనేక ఆబ్జెక్షన్లు పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా — యోగి ఆఫీస్ నుంచి NOC లేదు, కొన్ని డైలాగులు, సన్నివేశాలు తొలగించాలి అంటూ సూచనలు చేసింది.
అయితే జస్టిస్ రేవతి మొహితే దేరే – నీలా గోఖలే బెంచ్ స్వయంగా సినిమా చూసి… “ఏం అభ్యంతరకరమైనదీ లేదు” అంటూ స్పష్టం చేసింది. కాబట్టి ఏ కట్స్ లేకుండా సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని తీర్పునిచ్చింది.
సినిమా మేకర్స్ తరపున అడ్వొకేట్ రవి కదం, సత్య ఆనంద్, నిఖిల్ ఆరాధే వాదనలు వినిపించగా, “మూడు లైన్ల డిస్క్లైమర్ – ఇది కల్పిత కథ, నిజ జీవితానికి ప్రేరణతో రూపొందించబడింది” అని చూపిస్తామని చెప్పగా, కోర్టు దాన్ని అంగీకరించింది.
అసలేం జరిగింది
యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పేరును ఈ సినిమాలో అజయ్ మోహన్సింగ్గా మార్చారు. ఈ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్కు వెళ్లగా బోర్డు దీనికి సర్టిఫికెట్ నిరాకరించింది. ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని వెల్లడించింది. దీంతో దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ స్వీకరించే సమయంలో కోర్టు సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది.
ఎనిమిదేళ్లుగా ప్రజాదరణ పొందుతోన్న నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకనిర్మాతలు కోర్టుకు వెల్లడించారు. దీంతో పుస్తకంపై ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కించిన సినిమాకు సెన్సార్ ఎందుకు నిరాకరించారో తెలపాలని కోర్టు బోర్డును ఆదేశించింది.
పుస్తకం ఎలాంటి నెగెటివిటీ సృష్టించనప్పుడు ఈ సినిమా ఎలా వ్యతిరేక ప్రభావం చూపుతుందని సర్టిఫికెట్ ఆపారని ప్రశ్నించింది. సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేస్తూ సమాధానం కోరింది.
బోర్డు సభ్యులు సినిమాను చూడకుండా కేవలం ట్రైలర్ చూసి సర్టిఫికెట్ రిజెక్ట్ చేశారని నిర్మాతల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో యోగి గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు.
సెన్సార్ బోర్డు అభ్యంతరాలను తిప్పికొట్టిన కోర్టు తీర్పుతో ఈ సినిమా కాంట్రవర్శీలో నిలిచింది. ఇప్పుడు అందరి కళ్ళూ “యోగి బయోపిక్” వైపే!